ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:32 PM

ఏపీలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో అభ్యర్థులు అందరూ నామినేషన్ దాఖలు చేసే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ టికెట్ కోసం తంటాలు పడిన అభ్యర్థులు.. ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఓటర్ల మనసు దోచుకునే పనిలో పడ్డారు. ఎలా ఓటర్లను ఆకర్షించాలి.. ఎలా ఓట్లు కొల్లగట్టాలనే పనిలో ఉన్నారు. ఇక ఈ ప్రక్రియలో ప్రత్యర్థి మీద విమర్శలు గుప్పించడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు షరా మామూలే. అలాగే మీడియాలోనూ కనిపిస్తుండాలని అభ్యర్థులు ఉబలాటపడుతుంటారు. వీలైనంత మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కనిపిస్తూ జనాల నోళ్లల్లో నానాలనేది వారి ఉబలాటం.


అయితే ఈ ప్రయత్నమే ఓ టీడీపీ అభ్యర్థికి వింత అనుభవం ఎదురయ్యేలా చేసింది. అలా నామినేషన్ వేసి వస్తూనే.. కొద్ది సేపటికే కేసు నమోదయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగింది. పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుఫున పల్లె సింధూర రెడ్డి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలే పల్లె సింధూర రెడ్డి. అయితే పల్లె రఘునాథరెడ్డి మీద సర్వేల్లో కాస్త వ్యతిరేక ఫలితాలు రావటంతో.. ఈసారి ఆయన కోడలికి టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చిందనే వార్తలు ఉన్నాయి. ఏదైతేనేం పల్లె కుటుంబానికి టికెట్ దక్కిందనే సంతోషంలో రఘునాథరెడ్డి అనుచర గణం ఉంది.


ఇక 2024 ఎన్నికల కోసం పల్లె సింధూర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పుట్టపర్తిలోని ఆర్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత పల్లె సింధూర రెడ్డి చేసిన పని.. ఆమెపై కేసు నమోదయ్యేలా చేసింది. నామినేషన్ వేసిన తర్వాత ఆర్వో కార్యాలయంలో వద్దే సింధూర రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఫిర్యాదు మేరకు పల్లె సింధూర రెడ్డి మీద కేసు నమోదైంది.


ఆర్వో కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించటంతో పాటు.. ఆర్వో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు గానూ పల్లె సింధూర రెడ్డి మీద కేసు నమోదైంది. పల్లె సింధూర రెడ్డితో పాటుగా అమె భర్త కృష్ణ కిశోర్ రెడ్డి, ఆమె మామ పల్లె రఘునాథ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘించారనే కారణంతో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. ఆ రకంగా సింధూర రెడ్డి తెలియకుండా చేసిన పని నామినేషన్ వేసిన వెంటనే కేసు నమోదయ్యేందుకు కారణమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com