ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అభ్యర్థి వాచీ ఖరీదే 7.75 లక్షలట.. ఇక ఆస్తుల సంగతి తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:29 PM

 ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలైపోయింది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ వెంటనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి రోజు చాలాచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ వరకూ గడువు ఉంది. అయితే ఆదివారాలు, పబ్లిక్ హాలీడే‌స్‍‌లో నామినేషన్లు స్వీకరించరు. ఈ క్రమంలో మంచి రోజు, మంచి సమయం చూసుకుని నామినేషన్ దాఖలు చేసే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నారు. ఇక నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, తమపై ఉన్న కేసుల వివరాల గురించి అఫిడవిట్ సమర్పిస్తూ ఉంటారు. ఈ అఫిడవిట్లో పేర్కొనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల తాలూకూ సమాచారం అంతా వీటిలో ఉంటుంది.


ఇక అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్లో పలు ఆసక్తికర అంశాలు కూడా ఉంటాయి. ఆ రకంగానే చిత్తూరు అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్‌కు సంబంధించి కూడా ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. తనకు రూ.88.22 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు జగన్మోహన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే భార్య ప్రతిమ పేరిట రూ.36.67 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.5.14 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని.. 3.67 కేజీల బంగారం ఉందని అఫిడవిట్లో తెలిపారు. అలాగే తనపై కేసులేమీ లేవని చెప్పారు. ఇక రూ.17.52 కోట్ల అప్పులు ఉన్నాయని.. 3 కార్లు, హ్యార్లీ డేవిడ్సన్ బైక్ ఉన్నట్లు అఫిడవిట్లో చెప్పుకొచ్చారు. రూ.7.75 లక్షల విలువైన వాచ్‌తోపాటు బెంగళూరులో కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్‌లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు.


మరోవైపు చిత్తూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ పోటీ పడుతుండగా.. వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కూడా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే.. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మద్దతుగా ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీని వీడి.. జనసేనలో చేరి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చిత్తూరులోని ఆయన వర్గం కూడా కూటమి అభ్యర్థి అయిన గురజాలకు మద్దతుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com