ఏపీ ఎన్నికల్లో చిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు, అక్కా తముళ్లు, బావా మరదళ్లు ఇలా పలు నియోజకవర్గాల్లో బంధువుల మధ్యే పోటీ జరుగుతోంది. కడప లోక్ సభ స్థానంలో అక్కా తమ్ముళ్లైన వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి రెండు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మీద ఆయన భార్య దువ్వాడ వాణి బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో బావా మరదళ్ల మధ్యన పోటీ జరుగుతోంది. మరదలు ఓ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఆమెను ఓడించడమే లక్ష్యంగా బావ మరో పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి అధికార వైఎస్సార్సీపీ తరుఫన డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె పోటీలో ఉన్నారు. నారాయణస్వామిని ఈసారి ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావించింది. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా సైతం ప్రకటించింది. అలాగే ఎంపీ రెడ్డెప్పను గంగాధర నెల్లూరు అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అధిష్టానం నిర్ణయంపై నారాయణస్వామి అసంతృప్తి గురయ్యారు. దీంతో గంగాధర నెల్లూరు స్థానం నుంచి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది.
అయితే వైసీపీ నిర్ణయంతో నారాయణస్వామి మేనల్లుడు రమేష్ అసంతృప్తికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ తరుఫున ఇదే స్థానం నుంచి రమేష్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో నారాయణస్వామి విజయం కోసం పనిచేసిన రమేష్.. ఈసారి తనకు అవకాశం వస్తుందని భావించారు. అయితే నారాయణస్వామి కుమార్తెకు వైఎస్ జగన్ టికెట్ ఇవ్వటంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతోనే ఆమెను ఓడించటమే లక్ష్యంగా హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ శ్రేణులతో కలిసి పనిచేసిన రమేష్కు.. గంగధార నెల్లూరు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరదలిని ఓడించేందుకు బరిలోకి దిగిన బావ ఏ మేరకు సక్సెస్ అవుతారనేదీ చూడాలి మరి.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణస్వామి గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఆయన తరుఫున కూతురు బరిలోకి దిగుతున్నారు. అలాగే టీడీపి నుంచి థామస్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున నారాయణస్వామి మేనల్లుడు రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. మరి ఓటర్ల ఆశీర్వాదం ఎటువైపు ఉంటుందనేదీ చూడాలి మరి.