దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మండిపడ్డారు. గురువారం శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుడ్డా రాజశేఖరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆత్మకూరు గౌడ్సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు సీఎం జగన్ 40 హామీలిస్తే చెప్తే ఎమ్మెల్యే శిల్పా 400 అబద్ధాల హామీలతో ఇక్కడి ప్రజలు మోగించాడని చెప్పారు. వరదరాజ స్వామి ప్రాజెక్ట్కు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తి పోతల పథకాన్ని ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆనాడు తాను సిద్దాపురం ఎత్తిపోతలను పూర్తిచేయిస్తే కనీసం పంట కాలు వలను కూడా నిర్మించలేని స్థితిలో శిల్పా ఉన్నారని అన్నారు. వర్ధన్ బ్యాంకు పేరిట రూ.30కోట్ల దళితుల సొమ్మును కాజేశారని ఆరోపించారు. శ్రీశైలంలో కార్తీకేయ ఏజెన్సీ పేరిట నెలకు రూ.కోటిన్నర దోచుకుంటున్నారని, శ్రీశైలంలో టీకొట్టు నుంచి మరే ఏ ఇతర వ్యాపారం చేసుకోవాలన్న శిల్పాకు శిస్తు చెల్లించాల్సిన స్థితికి మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ అండతో శ్రీశైలంలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.