గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా? అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువాలు కప్పి యువతను వెనిగండ్ల రాము టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఎన్ని నిధులు తెచ్చి గుడివాడ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పలేము కానీ - జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియా, రియల్ మాఫియాలలో గుడివాడలో ఎంతో అభివృద్ధి చేశారంటూ ఎద్దేవా చేశారు. బూతులు తిడుతూ నోరేసుకొని పడిపోవడం కాదని, ప్రచారంలో తమ సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజల నిలదీతలపై దమ్ముంటే మాట్లాడాలన్నారు. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా నీటి కష్టాలు, రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘గుడివాడ ప్రజలకు మాట ఇస్తున్నాను - ఎన్నికల అనంతరం కూడా మీతో కలిసే ప్రయాణిస్తాను’’ అని హామీ ఇచ్చారు.