ఇప్పటికే ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు. తాజా మార్పుల ప్రకారం నరసాపురం సిటింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఆ ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది. రఘురామ కోసం ఆ సీటును తమకివ్వాలని చంద్రబాబు కోరినా బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. తమ అభ్యర్థి శ్రీనివాస వర్మకు గురువారం బీ-ఫాం కూడా అందజేసింది. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు. ఈ క్రమంలో రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు.