ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం సాగిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ప్రచారం సాగిస్తుంటే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర అంటూ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక హీరో నందమూరి బాలకృష్ణ సైతం స్వర్ణాంధ్ర సాకారయాత్ర పేరుతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచార సమయంలో నాయకులు ఆవేశంలో మాట జారుతున్నారు. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేస్తు్న్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీల ఫిర్యాదులతో టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వారి వివరణ కోరింది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్పై ఎలక్షన్ కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బాలకృష్ణ.. వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతని వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ కు వ్యతిరేకంగా రూపొందించిన పాటను తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేసినందుకు లోకేష్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది.
ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా బాలకృష్ణ మాట్లాడుతున్నారని, ఏకవచనంతో సంభోధిస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది.నువ్వు పోతావు.. పోయే కాలం వచ్చింది అని జగన్పై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చింది. అలాగే జగన్కు వ్యతిరేకంగా రూపొందించిన పాటను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానెల్ నుంచి తీసివేసేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి వైసీపీ ఫిర్యాదు మీద ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విమర్శల్లో వాడి పెరిగి అదికాస్తా వ్యక్తిగత దూషణల వరకూ చేరడం సరికాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల వరకూ సముచితమే కానీ.. అనుచిత వ్యాఖ్యల జోలికి పోకూడదని అంటున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇలాంటి వ్యాఖ్యలు, ఈ తరహా ఘటనలు మరిన్ని పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో పకడ్బందీగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం.. వైసీపీ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.