ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:52 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇవాళ నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్‌ కోరారు. సభల్లో రాళ్లు వేసుకోవడం, కోడికత్తి వంటి డ్రామాలతో ఓట్లు వస్తాయని వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారన్నారు. ఇలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు తీసుకువచ్చానని.. తాను పార్లమెంట్‌ సభ్యునిగా గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానన్నారు. తమ పార్టీ టికెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని.. అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచార పాటను విడుదల చేశారు.


ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా.. ఆంధ్రాను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే.. ప్రజలే షాకవుతారన్నారు. అంత అభివృద్ధి చేస్తానన్నారు. చీకటి కావాలంటే ప్రతి పక్షాలను... వెలుగు కావాలంటే తనను గెలిపించాలని.. తెలివైన ఓట్లర్లు తనను గెలిపిస్తారన్నారు. తనను చంపాలని చూస్తున్నారని.. తనకు నరకం చూపిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించే సత్తా తనకు తప్ప, ఎవరికీ లేదన్నారు. మోదీ బానిసలతో యుద్ధం చేస్తున్నానన్నారు. మళ్ళీ మోదీ వస్తే.. మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com