ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నువ్వా నేనా అన్న తీరుగా వైసీపీ, కూటమి నేతలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పలు చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. ఇరువర్గాల నేతల మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు సదరు అభ్యర్థులు. తాజాగా ఇలాంటి ఘటనే కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం, ఘర్షణకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్ళితే.... కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వవార్డులో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతకు చెందిన ప్రచార రథం.. టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వార్డులోకి రావడంతో అసలు పంచాయతీ మొదలైంది. ప్రచారంలో ఇరువురు నేతలు ఒకరికి ఒకరు ఎదురు కావడంతో మాటల యుద్ధం నెలకొంది. మాటా మాటా పెరిగడంతో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లారు. ఈ దాడిలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం అనంతపురంకు తరలించారు. ఇరు వర్గాల గొడవ తారాస్థాయికి చేరడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టేశారు. దీంతో అప్పటి వరకు రణరంగంగా మారిన ఆ ప్రాంతం.. పోలీసుల ఎంట్రీతో సైలెంట్గా మారిపోయింది. ఈ గొడవ అనంతరం ఇరు పార్టీల నేతలు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి తమ ప్రచారాలను కొనసాగించారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదంతో అక్కడి ప్రజలు కాసేపు భయాందోళనకు గురైన పరిస్థితి ఏర్పడింది.