నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ ఖరారైనప్పటికీ ఇక్కడి స్థానాన్ని మార్చవచ్చంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ కీలక పితాని సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మనే కొనసాగుతారని ఆయన స్పష్టత ఇచ్చారు. అభ్యర్థిని మారుస్తున్నారంటూ కొందరు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థిని మార్చబోతున్నారంటూ ఆశపడుతున్నవారి కల నెరవేరదని వ్యాఖ్యానించారు.ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే అందరి లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నరసాపురం ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు పితాని సత్యనారాయణ మాట్లాడారు. కాగా నరసాపురం ఎంపీ స్థానాన్ని మార్చబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణ రాజు టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ ప్రచారం మరింత జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పితాని సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.