‘నేను ఎంపీగా ఉన్న సమయంలో ఇటీవల పవన్కళ్యాణ్, చంద్రబాబును బాగా తిట్టాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. నాకు తిట్టడం రాదు.. అధిష్టానం తీరు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చా.. ఎప్పుడూ రాజకీయ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్న పేర్నినానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయి..’ అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి అన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి కోనేరుసెంటర్లో బహిరంగ సభలో బాలశౌరి మాట్లాడారు. పోర్టుకు నిధులు తానే తీసుకువచ్చానని పేర్ని నాని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మచిలీపట్నంలోని సాల్ట్ ఫ్యాక్టరీకి చెందిన మూడు వేల ఎకరాలకు ఇండస్ర్టీయల్ హబ్గా రూపొందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్కళ్యాణ్లను బాలశౌరి కోరారు. మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మిస్తామని, ముస్లింల కోరికమేరకు షాదీఖానా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.