సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టినా.. అసలైన సమరం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక్కడి నుంచి పోలింగ్ రోజు వరకు ప్రతి క్షణమూ విలువైనదే. నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అటు ఓటరు కరుణ పొందడానికి ప్రయత్నించడంతో పాటు ఇటు ఎన్నికల నిబంధనలు పాటించడం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు.. నిబంధనలను పరిశీలిద్దాం.
ముఖ్యమైన తేదీలు
నామినేషన్ల దాఖలు: ఏప్రిల్ 18 నుంచి 25
నామినేషన్ల పరిశీలన: 26
ఉపసంహరణ: 29
పోలింగ్: మే 13
ఓట్ల లెక్కింపు: జూన్ 4
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వయస్సు 25 ఏళ్లు నిండి.. భారత పౌరుడై ఉండాలి. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందినరాజకీయ పక్షాల తరఫున పోటీ చేసే వారి అభ్యర్థిత్వాన్ని ఒకరు బలపరచాలి. బలపరిచిన అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో ఓటరుగా ఉండాలి. పేరు, పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలో వరుస సంఖ్య, వంటి ఆంశాలను ప్రస్తావించాలి. స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం పది మంది ఓటర్లు బలపరచాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 33(1) ప్రకారం ఇది తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన ఇంకా గుర్తింపు లేని పార్టీలు (రిజిస్టర్డ్ అన్రికగ్నెజ్డ్) నుంచి పోటీ చేసే అభ్యర్ధులకు కూడా పది మంది బలపరిచేవారు ఉండాలి. లేదంటే నామినేషన్ను తిరస్కరిస్తారు. నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు లేకపోయినా ప్రతిపాదన చెల్లదు.అభ్యర్థులు ప్రచారానికి మూడు వాహనాలను మాత్రమే వినియోగించాలి. వీటికి ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. వాహనాలు ఎక్కువ ఉంటే ఎన్నికల సంఘం చర్యలకు గురవుతారు. అభ్యర్థి వ్యయంలో నమోదు చేస్తారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఓట్లు అడగరాదు. ఓటర్లకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురిచేయరాదు. ఎన్నికల ప్రచార సమయంలో ఇరు పార్టీలు ఎదురురెదుగా రాకూడదు. ఒక పార్టీ ప్రచార ప్రతులను మరో పార్టీ చించకూడదు. సమస్యలపై ధర్నాలు, ర్యాలీలు, సభలు వంటివి నిర్వహించకూడదు. అధికారుల అనుమతితో లౌడ్ స్పీకర్లు వినియోగించాలి. పాఠశాలలు, ప్రార్ధనా మందిరాల వద్ద ప్రచారాలు నిషేథం.