ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం 5 రూపాయలే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 07:06 PM

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. పది దాటిందంటే చాలు ఇల్లుదాటి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. ఓవైపు సుర్రుమనిపిస్తున్న సూరీడు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ప్రయాణాలంటే వామ్మో అనే పరిస్థితి. రాత్రి వేళ ఫర్వాలేదు కానీ.. పగటిపూట ప్రయాణాలంటే ఇబ్బందికరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేలా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.


రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. వేసవి సీజన్, వేడిగాలుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు స్టేషన్లలో చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం వీటికి అదనంగా వాటర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 170 స్టేషన్లలో 468 ప్యూరిఫైడ్ వాటర్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు.


ఈ ప్యూరిఫైడ్ వాటర్ వెండింగ్ మెషీన్ల ద్వారా లీటర్ ఐదు రూపాయల చొప్పున కూలింగ్ వాటర్ అందించనున్నారు. గ్లాస్ నీటిని 2 రూపాయలకు, అరలీటర్ నీటిని 3 రూపాయలకు, లీటర్ నీటిని 5 రూపాయలకు, 2 లీటర్ల నీటిని 10 రూపాయలకు అందించనున్నారు. ప్యూరిఫైడ్ కూలింగ్ వాటర్ దుకాణాల్లో కొనుగోలు చేయాలంటే లీటర్‍‌కు 20 రూపాయల వరకూ ఖర్చుచేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండాకాలం ప్యూరిఫైడ్ కూలింగ్ వాటర్‌ను ఐదు రూపాయలకే అందించడం పట్ల ప్రయాణికులకు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.


వీటితోపాటుగా రైల్వేస్టేషన్లలో 24 గంటలూ మంచినీరు అందుబాటులో ఉండేలా చూసేందుకు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. డివిజనల్ సెంట్రల్ కంట్రోల్ ఆఫీస్ ఆధ్వర్యంలో దీనిని పర్యవేక్షించనున్నారు. ఒకవేళ ఇందులో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అధికారులకు చేరిపోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com