ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది వర్షాలు ఎక్కువే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:45 PM

కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు)లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. దీర్ఘకాలిక సగటులో 106 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల దీర్ఘకాలిక సగటు (1971 నుంచి 2020 వరకు 87 సెంటీమీటర్లు)లో 106 శాతం (ఐదు శాతం అటు ఇటుగా) నమోదవుతుందని అంచనా వేసింది. దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, తూర్పు భారతంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌తోపాటు ఈ రాష్ట్రాలకు ఆనుకుని దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌, విదర్భ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలు, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని, రైస్‌ బెల్ట్‌గా పిలిచే గంగా మైదానంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని ఐఎండీ నివేదిక స్పష్టం చేసింది. కాగా.. తాజా నివేదికపై సవరించిన బులెటిన్‌ను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com