ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:06 PM

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలకు.. వివేకా కుమార్తె సునీతా రెడ్డి కౌంటరిచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని జగన్‌న ప్రశ్నించారు. 'నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా.. నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తున్నావా? చిన్నాన్న చనిపోయి అయిదేళ్లయింది.. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు' అంటూ మండిపడ్డారు.


నాన్న తర్వాత అంతటివారైన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఐదేళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. 'వివేకం చిన్నాన్న అంటున్నావు.. బంధుత్వానికి అర్థం తెలుసా నీకు? మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా.. నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం?' అన్నారు. అంతఃకరణ శుద్ధిగా తాను అంతా నిజమే చెబుతున్నా.. ఇదే మాట జగన్‌ ఎందుకు చెప్పడం లేదు? అన్నారు. చిన్నాన్నను ఎవరు చంపారన్నది దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసన్న జగన్.. అందుకే వాళ్లను రక్షిస్తున్నారా? అన్నారు సునీత.


చంపినోడు జైలుకెళ్లకుండా బయట తిరుగుతున్నారిని జగన్ అంటున్నారని.. చంపినట్లు నమ్ముతున్నప్పుడు ఎవరు చంపించారో దస్తగిరి చెబుతుంటే ఎందుకు నమ్మరని జగన్‌ను సునీత ప్రశ్నించారు. వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిలు కుట్ర పన్నారని చెప్పినా ఎందుకు వెనకేసుకు వస్తున్నారన్నారు. పోలీసులు నిందితులను ఎలా రక్షిస్తున్నారో చెప్పడానికి కర్నూలు సంఘటనే ఉదాహరణ అన్నారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించి.. నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెటిచ్చి ఓట్లు వేయాలని అడగటం సిగ్గుచేటన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నానని.. దీనివల్ల తాను అందరినీ కోల్పోవడం తప్ప ఏమీ లేదన్నారు. జగన్ మాత్రం పదవుల కోసం వాడుకుంటున్నారన్నారు.


వివేకా రక్తంతో వైఎస్సార్‌సీపీ పునాదులు వేసుకుందని.. అందులో నిందితులకు, వారిని వెనకేసుకొస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రిని ఓడించిన వారితో తిరుగుతున్నామని జగన్‌ అంటున్నారని.. ఆయన ఏకంగా నిందితులనే వెనకేసుకుని, వారికే టికెట్లిచ్చారన్నారు. వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసీ దాన్ని మరిచిపోయి ఓటు అడగడానికి మనసెలా వచ్చిందన్నారు. తాను పోరాడేది న్యాయం కోసమని.. వారు పోరాడేది పదవులు కోసమన్నారు. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు, వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ల బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com