ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన పార్టీకి షాకులు తగులుతూ ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి పక్కపార్టీలోకి వలస వెళ్లుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీ గూటికి చేరనున్నట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు. పొత్తులో భాగంగా 21 సీట్లు వస్తే ఒక్క శెట్టి బలిజకు కూడా సీటు ఇవ్వలేదని ఆరోపించారు.
మరోవైపు.. పితాని బాలకృష్ణ గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకూ ముమ్మిడివరం వైసీపీ సమన్వయకర్తగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీలో చేరిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ముమ్మిడివరం జనసేన సమన్వయకర్తగా కొనసాగుతూ వస్తున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో ముమ్మిడివరం, రామచంద్రాపురం స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని పితాని బాలకృష్ణ భావించారు. కానీ జనసేన నుంచి సీటు దక్కకపోవటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు గుడ్ బై చెప్పిన పితాని బాలకృష్ణ.. తిరిగి సొంతగూటికి చేరేందుకు రెడీ అయ్యారు. శనివారం, లేదా ఆదివారం రోజు సీఎం జగన్ సమక్షంలో పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలిసింది.