ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలును నడిపిన లోకో పైలెట్'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 05:20 PM

రైళ్లోని ప్రయాణికులకు సురక్షితంగా ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత వారిది. వారి చేతుల్లో వందల మంది ప్రాణాలు ఉన్న సమయమది. కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విధుల్లో బాధ్యత మరిచి ప్రవర్తించారు. ఫలితం 14 కుటుంబాల్లో గుండెకోత. 50 మందికి గాయాలు. గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ప్రమాదానికి గల కారణాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేశాఖలో ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించిన అశ్వినీ వైష్ణవ్.. ఈ క్రమంలోనే కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనను ప్రస్తావించారు. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.


ఈ ప్రమాదానికి లోకోపైలెట్ల నిర్లక్ష్యమే కారణమని మంత్రి వివరించారు. ప్రమాద సమయంలో పలాస ప్యాసింజర్ రైలులోని ఇద్దరు లోకో పైలెట్లు రైలు నడుపుతూ క్రికెట్ చూశారని చెప్పారు. డ్రైవింగ్ మీద పరధ్యానంగా ఉండి సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ ఉండిపోయినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ ఘటన తర్వాత లోకో పైలెట్లను నిత్యం పర్యవేక్షించేలా కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ మీద చర్యలు కూడా తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.


అసలేం జరిగిందంటే..


అక్టోబర్ 29వ తేదీ 2023లో విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రాయగడ ప్యాసింజర్ సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్.. రాయగడ ప్యాసింజర్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది చనిపోగా.. 50 మంది వరకూ గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని యాక్సిడెంట్ మీద దర్యాప్తు జరిపిన కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు తేల్చారు. ప్రమాదంపై రైల్వే బోర్డుకు నివేదికను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com