ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో షూట్ అని తీసుకెళ్లి స్నేహితుడే చంపేశాడు.. అమ్మాయి సాయంతో పోలీసుల వల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 04:38 PM

విశాఖపట్నం మధురవాడలో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైన యువకుడు హత్యకు గురైనట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. బక్కన్న పాలెనికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ (23) వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. ఈవెంట్స్‌కు ఫోటో షూట్లు చేస్తూ జీవిస్తుంటాడు. అయితే ఫిబ్రవరి 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వెడ్డింగ్ షూట్ ఉందంటూ కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్‌కు మెసేజ్ చేశారు. దీంతో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన సాయి.. తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన అతని తల్లిదండ్రులు ఫిబ్రవరి 29న ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావటంతో పోలీసులను ఆశ్రయించారు.


సాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సాయి పవన్ కళ్యాణ్‌ హత్యకు గురైనట్లు గుర్తించారు.వెడ్డింగ్ ఫోటో షాట్ ఉందంటూ ఫోన్ చేసిన షణ్ముక తేజ అనే యువకుడు సాయి పవన్ కళ్యాణ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. ఆన్‌లైన్‌లో సాయి పవన్ కళ్యాణ్‌కు షణ్ముక తేజ అనే ఫోటోగ్రాఫర్ ఇటీవల పరిచయం అయ్యాడు. సాయి వద్ద ఉన్న హై టెక్నాలజీ కెమెరాను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26వ తేదీన వెడ్డింగ్ షూట్ ఉందంటూ సాయి పవన్ కళ్యాణ్‌కు సమాచారం ఇచ్చాడు షణ్ముక తేజ.


కెమెరా కోసం దారుణం.. ఫోటో షూట్ అని తీసుకెళ్లి స్నేహితుడి హత్య


తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పెద్ద ఈవెంట్ ఉంది.. నీ దగ్గర ఉన్న కెమెరాలతో షూట్ చేద్దామని అతనికి సూచించాడు. ఆ ఈవెంట్ చేస్తే సినిమాలలో అవకాశం వస్తుందని ఆశ చూపించాడు. దీంతో అతగాడి మాటలు నమ్మిన సాయి పవన్ కళ్యాణ్.. తన కెమెరాలు తీసుకుని ట్రైన్‌లో రాజమండ్రి చేరుకున్నాడు.ఇక రాజమండ్రిలో సాయి పవన్ కళ్యాణ్‌కు పికప్ చేసుకున్న షణ్మక తేజ..అద్దెకు తీసుకున్న కారులో ఆలమూరు, రావులపాలెం ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే వారిమీద అనుమానం వచ్చిన సాయి పవన్ కళ్యాణ్.. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవటంతో కారును ఫోటో తీసి తన తల్లికి పంపించాడు. తెలియనివారితో వెడ్డింగ్ షూట్ కోసం వచ్చానని.. ఫోన్ పనిచేయకపోతే ఇంకో నంబర్‌కు ఫోన్ చేయాలంటూ తల్లికి సమాచారం ఇచ్చాడు.


ఆ తర్వాత సాయి పవన్ కళ్యాణ్ ఫోన్ పనిచేయకపోవటంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా షణ్ముక తేజ వెంట వెళ్లినట్లు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లి విచారణ చేస్తే పరారీలో ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో అతనిలో గదిలో పవన్ కళ్యాణ్‌కు చెందిన కెమెరాలను పోలీసులు గుర్తించారు.


అనంతరం షణ్మకకు విశాఖపట్నానికి చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్ పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ అమ్మాయి ద్వారా షణ్ముకతో చాటింగ్ చేయించారు.. ఆమె మెసేజ్‌లకు షణ్ముక తేజ రిప్లై ఇవ్వటంతో.. నంబర్ ట్రేస్ చేసిన పోలీసులు సకాలంలో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోతిన విజయసాయి పవన్ కళ్యాణ్‌ను హత్య చేసినట్లు షణ్ముక అంగీకరించినట్లు తెలిసింది. ఇక వెడ్డింగ్ షూట్ కోసమని వెళ్లినవాడు హత్యకు గురయ్యాడనే వార్తతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com