ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడివాడ వైసీపీ టికెట్‌ ఎవరికో క్లారిటీ ఇదేనా.. ఒక్కమాటలో తేల్చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 08:34 PM

గుడివాడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావుకు అధిష్ఠానం అవకాశం కల్పిస్తోందంటూ.. పట్టణంలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. హనుమంతరావుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చిందనీ ప్రచారం జరిగింది. ఆ తర్వాత గుడివాడ మార్కెట్‌ సెంటరులో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీకి మున్సిపాలిటీ అనుమతి లేదంటూ.. పోలీసులు తొలగించి తీసుకెళ్లిపోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రధాన అనుచరుడైన మెరుగుమాల కాళీ యాదవ్‌కే గుడివాడ టికెట్‌ ఇస్తున్నారంటూ మరో పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతో కలిసి మండల హనుమంతరావు మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థినంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్నదంతా దుష్ప్రచారమేనన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానికి, తనకు అభిప్రాయభేదాలు ఏవీ లేవన్నారు. ఆయన మాటను దాటి తాను ఏదీ చేయబోనన్నారు. తనకు పదవి, ఇతర ప్రయోజనాలు కావాలనే కోరిక లేదని, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా మాత్రమే ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు. తనకు పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవని.. వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు హనుమంతరావు. తాను పార్టీ లైను దాటి వెళ్లనని చెప్పారు.


గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు.. పకోడీగాళ్లు కాదన్నారు కొడాలి నాని. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు అంటూ సెటైర్లు పేల్చారు. ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్‌లను ఏడు విడతల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని.. అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీలో సీట్ల మార్పులు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తారని.. తనను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనాలన్నారు.


గన్నవరంలో వంశీని, గుడివాడలో తనను మారుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారా? అని ప్రశ్నించారు. సీట్లు డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్‌సీపీలో ఉండదని.. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తారన్నారు. తమ మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదని.. వైఎస్సార్‌సీపీలో ఒకరు ట్రైచేస్తేనో.. ఎవరో చెబితేనో టిక్కెట్లు రావన్నారు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయని.. ఎంతమంది కలిసొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించలేరన్నారు. జగన్‌ సింగిల్‌గా వస్తానని చెబుతున్నారని.. చంద్రబాబు పర్మినెంట్‌గా మాజీగానే ఉంటారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com