న్యూఢిల్లీ: ఇటీవల కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భీకర వర్షాల వల్ల ఆ రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కొందరు ఎంపీలు కేరళ వరద బాధితులకు విరాళం ఇచ్చారు. ఇవాళ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆ విషయాన్ని ప్రకటించారు. రాజ్యసభకు చెందిన ఎంపీలు సుమారు 38 కోట్లను కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. మొత్తం 93 మంది సభ్యులు ఈ మొత్తాన్ని సేకరించినట్లు చెప్పారు. రాజ్యసభకు చెందిన 60 మంది ఎంపీలు తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. విరాళం ఇచ్చిన వారికి వెంకయ్య కృతజ్క్షతలు చెప్పారు. మిగితా వారు కూడా ఇలాగే విరాళం ఇవ్వాలని విజ్క్షప్తి చేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా ఈనెల 24, 26వ తేదీల్లోనూ సభకు సెలవు ప్రకటించారు. అయితే సమయం తక్కువగా ఉన్న కారణంగా దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం తన ప్రసంగంలో రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించలేదని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ ఇవాళ స్పష్టం చేశారు. మరో వైపు ఇవాళ కూడా రెండు సభలు ఉదయం వాయిదా పడ్డాయి. రాఫెల్ అంశంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉభయసభలు వాయిదా పడ్డాయి.