కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడంపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. కలైజ్ఞర్ కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ మేరకు స్టాలిన్ రాహుల్ను అభ్యర్థిగా ప్రతిపాదించారు. దేశాన్ని కాపాడడానికి వేదికపై ఉన్న మిగిలిన నేతలు రాహుల్కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్టాలిన్ డీఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు. అందులో.. మోదీ నేతృత్వంలోని నియంతృత్వ భాజపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, భిన్నత్వంలో ఏకత్వాన్ని మంటగలిపి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం తమిళనాడుకు అన్యాయం చేస్తోందని, ఇంతకాలం ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించటం లౌకికవాద కూటమికి బలాన్ని చేకూర్చుతుందన్నారు. లౌకికవాద పార్టీలను ఏకం చేయడానికి ఈ మేరకు ప్రతిపాదించానన్నారు. కరుణానిధి లాగే నెహ్రూ కుటుంబంపై ఇందిరా గాంధీ నుంచి ఇప్పటివరకు డీఎంకే నమ్మకం పెట్టుకుందన్నారు. దేశం మేలు కోసమే రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. 2004లో లౌకికవాద ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ముఖ్య కారణమైందని, సోనియా గాంధీని అనేక మంది వ్యతిరేకించినా కరుణానిధి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.