కాకినాడ: పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తుఫాన్ తీరం దాటిన ప్రాంతంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం చంద్రబాబు భైరవపాలెం చేరుకుని తుఫాను బాధితులతో మాట్లాడారు. 1996లో కూడా హెరికెన్ తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే వచ్చానన్నారు. హుద్ హుద్,తిట్లీ వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించానన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఐఎండీ ఇవ్వలేని సమాచారం మన సొంత వ్యవస్థ ద్వారా ఇచ్చామన్నారు. తుఫాన్ వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడుకోగలిగామన్నారు.
ముందస్తు చర్యలు పగడ్బందీ గా తీసుకున్నామన్నారు. సెల్ టవర్లు అన్నీ సక్రమంగా పని చేసేలా చేయగలిగామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందిస్తున్నామన్నారు. మధ్యవర్తులు, దళారులు లేకుండా లబ్ధిదారులకు చేరుస్తున్నామని వివరించారు. భైరవపాలెం లో అందరికీ పక్కా ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లలేక పోయిన మత్స్యకారుల కి 2వేల రూపాయల విలువైన ప్యాకేజ్ అందిస్తున్నామన్నారు.