తిరువనంతపురం: ట్రాన్స్జెండర్లు ఇవాళ శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారితో చర్చలు జరిపిన తర్వాత ట్రాన్స్జెండర్లకు అనుమతి లభించింది. ఆ తర్వాత ఇవాళ వాళ్లు అయ్యప్పను దర్శించుకున్ని మొక్కులు చెల్లించుకున్నారు.
నల్లచీరలు ధరించి, ఇరుముడితో సాంప్రదాయబద్ధంగా వచ్చిన నలుగురు ట్రాన్స్జెండర్లకు పోలీసులు భద్రత కల్పించారు. నీలక్కల్ నుంచి పంబ వరకు, ఆ తర్వాత కొండ ఎక్కుతున్న సమయంలో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. ఆలయంలోకి పవిత్రమైన 18 మెట్లను కూడా వాళ్లు ఎక్కారు. నలుగురు ట్రాన్స్జెండర్లను అనన్య, తృప్తి, రెంజుమోల్, అవంతికలుగా గుర్తించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు కూడా శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అంటూ ఇటీవల సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడ ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే.