న్యూఢిల్లి : లోక్సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటినుంచి సభ్యులు నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బిజెపి సభ్యులు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టిడిపి ఎంపిలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, తమిళనాడు ఎంపిలు మెకెదాతు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు పోడియం వద్దనుంచి తమ సీట్లలోకి వెళ్లాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. ఒక దశలో సుమిత్రా మహాజన్ ఆందోళన చేస్తున్న సభ్యులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తమ సీట్లలోకి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాపలై చర్చించడానికి తాను అనుమతి ఇస్తానని ఆమె చెప్పారు. రాఫెల్ డీల్పై జెపిసి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీనితో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.