న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితులకు కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నదంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మీడియాతో మాట్లాడుతూ సజ్జన్ కుమార్కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడం కానీ, పదవిని అప్పగించడం కానీ చేయలేదన్నారు. కాగా సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శిరోమణి అకాలీదళ్ హర్షం వ్యక్తం చేసింది. సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని, వారు రాజకీయంగా లబ్ధి పొందుతూ విచారణ నుంచి తప్పించుకున్నారని కోర్టు తీర్పులో వెల్లడైందని సాద్ నేత, ఢిల్లీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులైన జగదీష్ టైట్లర్, కమల్నాథ్ వంటి పార్టీ నేతలకు రాహుల్ బాసటగా నిలబడుతున్నారంటూ ఆరోపణలు గుప్పంచారు.