ఎఎంఎంకె వ్యవస్థాపకుడు టిటివి.దినకరన్ కీలక సహాయకుల్లో ఒకరు డిఎంకెలో శుక్రవారం చేరారు. అనర్హులుగా ప్రకటించిన 18మంది అన్నాడిఎంకె ఎంఎల్ఎల్లో ఒకరైన వి.సెంథిల్ బాలాజీ, డిఎంకె నేత స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అన్నాడిఎంకెకు చెందిన 18మంది ఎంఎల్ఎలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ధనపాల్ ఇచ్చిన ఆదేశాలను మద్రాసు హైకోర్టు అక్టోబరులో సమర్ధించిన నేపథ్యంలో తన వారినందరినీ కలిసికట్టుగా వుంచడం దినకరన్కు కష్టసాధ్యంగా మారిందని వార్తలు వస్తుండడంతో ఈ ఫిరాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పళనిసామిపై తిరుగుబాటు చేసినందుకు గతేడాది ధనపాల్ వారిని అనర్హులుగా ప్రకటించారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేయవద్దన్న దినకరన్ నిర్ణయం పట్ల అనర్హులైన ఎంఎల్ఎలు సంతోషంగా లేరు. బాలాజీ 2016లో జరిగిన ఎన్నికల్లో అరవకురిచి నుండి ఎన్నికయ్యారు. ఈ ఫిరాయింపును ముందుగానే ఊహించిన దినకరన్ గురువారమే పరోక్షంగా బాలాజీపై దాడి చేశారు. స్వప్రయోజనాలతో ఎవరైనా ఎఎంఎంకె నుండి బయటకు వచ్చినా ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు.