తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదేదో అంటున్నారని.. తన జీవితంలో భయమనేదే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తగరపువలసలో ఏర్పాటు చేసిన ఆత్మీయసదస్సులో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల కోసం దేనికైనా టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు. లాలూచీ రాజకీయాలు చేసేవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే మన కష్టాలు తగ్గి ఉండేవని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రంగాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందన్నారు. కేంద్రం సహకరించకున్నా మన కష్టం మనకు ఉపయోగపడిందన్నారు. దొంగ దెబ్బతీయాలని చూస్తే టీడీపీ బొబ్బిలిపులిలా ముందుకెళ్తుందని.. దేనికీ భయపడదని.. నమ్మించే మోసం చేస్తే ఇంట్లో పడుకోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
మంచో చెడో విభజన జరిగిందని, హైదరాబాద్ను అభివృద్ధి చేశామని.. ఇక్కడి వాళ్లకు కూడా మెరుగైన.. ఎక్కడా లాలూచీపడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తానైతే తప్ప రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని ప్రజలు గెలిపించారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గొడవలు అక్కర్లేదనుకున్నానని, రాష్ట్రం కోసం కష్టపడాలనుకున్నానని అన్నారు. ఇక్కడున్న రాజకీయపార్టీలతో లాలూచీపడ్డారని బాబు విమర్శించారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వైసీపీ...ఏ కేసులు లేకున్నా మనపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లాలూచీ రాజకీయాలు చేసి రాష్ట్రానికి నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన 62 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.