ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్...జీవోను రద్దు చేయాలని కోరిన రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 07:36 PM

అమరావతి రైతులు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో క్యాంప్‌ కార్యాలయాల పేరు చెప్పి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రయత్నాలు జరుగతున్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 22న జారీ చేసిన జీవో 2283ను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావుతో పాటూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు జీఏడీ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విశాఖ కలెక్టర్‌, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, రుషికొండ టూరిజం ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ తదితరులను ప్రతివాదులుగా ఉన్నారు.


ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ సచివాలయం నుంచి కార్యాలయాలను తరలిస్తున్నారన్నారు. మిలేనియం టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు అనువుగా మార్చడాన్ని ఐటీ పాలసీని ఉల్లంఘించడంగా ప్రకటించాలని కోరారు. విశాఖలోని విమ్స్‌కు ప్రాంగణాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మారుస్తున్నారన్నారు. విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ప్రాంగణాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడం నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎమ్‌సీ) నియమనిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.అధికారుల చర్యలు ఏపీ బిజినెస్‌ రూల్స్‌, సెక్రటేరియట్‌ మాన్యువల్‌ ఉల్లంఘనగా ప్రకటించాలన్నారు. జీవో 2283ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. 


అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ప్రతివాదులు వ్యవహరిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. భూములిచ్చిన రైతులను, తీర్పు ఇచ్చిన కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతుల హక్కులను కాపాడేలా అమరావతే రాజధాని అని గతంలో త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సచివాలయంలోని ప్రభుత్వ శాఖలను తరలించడానికి వీల్లేదని అందులో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ క్యాంప్‌ ఆఫీసు ముసుగులో అమరావతిలోని సచివాలయం మొత్తాన్ని శాశ్వతంగా తరలిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రుషికొండపై టూరిజం రిసార్ట్‌ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారని కోర్టుకు తెలిపారు. పెద్ద ప్యాలెస్ నిర్మించారని.. భారీగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారన్నారు.


శాఖలోని రుషికొండపై టూరిజం ప్రాజెక్ట్‌ పేరుతో నిర్మాణాలను చేపట్టారు. సీఎస్‌ చట్టబద్ధమైన పాలన మర్చిపోయారు. సీఎం చెప్పినదానిని గుడ్డిగా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు జారీచేసిన జీవో అమలును ఆపేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com