అమరావతి: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా తిథిలి తుఫాను వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే నేడు కేంద్ర మంత్రి వచ్చి పర్యటించడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి ఇప్పటికే 220 కోట్లు విడుదల చేశామని చెప్పడం, త్వరలో 300 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 3000 కోట్ల రూపాయల నష్టం వాటిలీతే 200 కోట్లు ఇచ్చి నేడు చేతులు దులుపుకోవాలని చూడటం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు కేంద్రంలోని మంత్రులని ఆడిగి నిధులు ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. దేశంలోని స్వతంత్ర సంస్థలు అయిన సుప్రీంకోర్టు జడ్జిస్, కీలకమైన దర్యాప్తు సంస్థ అయినా సీబీఐ వ్యవస్థను, రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.