నెల్లూరు: ధర్మపోరాట సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీరు ఇచ్చి హామీలకు ఎగనామం పెట్టారన్నారు. హామీల అమలు చేయాలని.. రాష్ట్రంలో పార్టీలు ఎన్నిఅన్నా.. ఎంత అవమానించినా ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగానని.. కానీ ఏపీ మీద మోడీకి మనసుమాత్రం కరగలేదన్నారు. హామీలు అమలు చేయమంటే ఐటీ దాడులకు దిగారని.. హామీల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు విరోచితంగా పోరాడితే వైసీపీ ఎంపీలు మాత్రం మోడీతో లాలూచీ పడ్డారన్నారు. రాష్ట్ర ప్రజల తరపున నిలబడితే దాడులు చేయిస్తారా? ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేస్తామని వేదికల మీద ప్రజల సాక్షిగా, వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి నమ్మించి నమ్మకద్రోహం చేసిందని.. బీజేపీ చేసింది ముమ్మాటికి దగానే అన్నారు.
కేంద్రం రెవెన్యూ లోటు కింద 16 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే.. 3400 కోట్లు ఇచ్చి మిగతా డబ్బుకు ఎగనామం పెట్టారన్నారు. కేంద్రం పన్నుల రూపంలో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నా ఏపీకి మాత్రం కక్షకట్టి సహాయనిరాకరణ చేస్తున్నారన్నారు. కేంద్రం ఎంత కక్షకట్టినా ప్రపంచం మెచ్చేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఎవరంటే.. ఎవరైనా చెబుతారని.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది టీడీపీనే అన్నారు. ఏపీకి నమ్మకద్రోహం ఎందుకు చేసారో కేంద్రం చెప్పాలన్న సీఎం నమ్మకద్రోహం-రాజకీయ కుట్రలపైనే ఈ ధర్మ పోరాటసభలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికోసమే ఆనాడు బీజేపీతో జతకట్టామని పదవుల కోసం పొత్తుపెట్టుకోలేదన్నారు. కానీ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని.. ఆ నమ్మకద్రోహాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉందన్నారు.