యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కార్యకర్తలు నేడు నీలక్కళ్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్లపై బైఠాయించారు. కేరళ శాసనసభలో ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వారికి నాయకత్వం వహించారు. శబరిమలకు వెళ్లే ప్రధాన రహదారిపై నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 250 మంది కార్యకర్తలు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రధాన ట్రంక్ రోడ్డుపై బైఠాయించారు. నలుగురు ఎమ్మెల్యేలు వారి కార్లలో పంపా పట్టణానికి వెళ్లవచ్చునని పోలీస్ సూపరింటెండెంట్ యతీశ్ చంద్ర చెప్పారు. అయితే మొత్తం యుడిఎఫ్ బృందమంతా శబరిమల వెళ్లాలనుకుంటున్నట్లు రమేశ్ చెన్నితల చెప్పారు. నిషేధాజ్ఞలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఊమెన్ చాందీ డిమాండ్ చేశారు. పలువురు నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పోలీసుల తీరును విమర్శించారు. చివరకు అందరూ వెళ్లడానికి పోలీసులు అనుమతినిచ్చారు.