అమరావతి : పట్టణాలలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అర్బన్ హౌసింగ్ పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… లీగల్ ఒపీనియన్ లలో జాప్యం జరగరాదన్నారు. లబ్దిదారుల నుంచి వ్యక్తిగత లేఖలు వెంటనే తీసుకోవాలన్నారు. అతిస్వల్ప అంశాలను కూడా క్లిష్టం చేయడం సరైందికాదన్నారు. ప్రతిఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. ప్రతి బుధవారం అర్బన్ హౌసింగ్ పై సమీక్షిస్తానన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అన్నివసతులతో సొంత ఇల్లు ఇస్తామన్నారు. పట్టణ గృహనిర్మాణం ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదన్నారు. పేదలకు ఒక ఆస్తిని సమకూర్చే ప్రాజెక్టు అన్నారు. అర్బన్ హౌసింగ్ పై అందరూ శ్రద్ధపెట్టాలని చంద్రబాబు తెలిపారు. ఒక ఇల్లు కట్టాలంటే వంద ఏజెన్సీల చుట్టూ తిరగాలని, ఉబరైజేషన్ ద్వారా అన్నింటినీ కన్వర్జెన్స్ చేశామన్నారు. ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, బ్యాంకు రుణం, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చామన్నారు. ప్రతి అంశానికి నిర్దిష్టమైన గడువును నిర్దేశించాలని తెలిపారు. గడువులోపల పనులు పూర్తిచేయాలని పేర్కొన్నారు. షేర్ వాన్ టెక్నాలజీ షీట్ లు 835 రావాలని, ఇప్పటివరకు 516షీట్లే తెచ్చారని, మిగిలిన 319 షేర్ వాన్ షీట్లు తెప్పించాలన్నారు. రుణాల మంజూరును బ్యాంకర్లు వేగవంతం చేయాలన్నారు.
అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే త్వరలోనే పట్టణాలలో లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశాలు, వారంవారం ప్రతిశాఖ పురోగతిని సమీక్షిస్తానన్నారు. బ్యాంకర్లు, డెవలపర్లు, అధికారులు పనితీరును విశ్లేషిస్తానని, ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, ప్లాన్ ల తయారీ, పనుల పురోగతిని సమీక్షించాలని, 5లక్షల ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారు ? ఎన్ని ఇళ్లకు ప్రారంభోత్సవాలు జరిగాయి..? అన్ని అంశాలను ఆన్ లైన్ లో ఉంచాలని చంద్రబాబు తెలిపారు.