ముజఫర్పూర్ షెల్టర్ హోం కేసులో పరారీలో ఉన్న బీహార్ మాజీ మంత్రి మంజువర్మ నేడు బేగుసరాయిలోని కోర్టులో లొంగిపోయారు. షెల్టర్ హోంలో బాలికలపై అత్యాచారాలు జరపడం, హత్య చేయడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసులో అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజువర్మ భర్త ప్రధాన నిందితుడు. మంజువర్మపై ఆరోపణలు రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆమె కనిపించకుండా పోయారు. ఈ కేసుపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు మంజువర్మ జాడ తెలియలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీనితో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కేబినెట్ మంత్రి పరారీలో ఉన్నారా? ఫెంటాస్టిక్… ఒక కేబినెట్ మంత్రి అదృశ్యమయ్యారు, ఆమె ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.. ఈ కేసులో తీవ్రను మీరు గుర్తిస్తున్నారా? అంటూ జస్టిస్ లోకూర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.