అమరావతి : ముఖ్యమంత్రి మేధస్సు నుంచి వచ్చిన ప్రాజెక్టే భూసేవ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. భూసేవ రాష్ట్రవ్యాప్త ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోర్స్ అనే అత్యాధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి దానిద్వారా శాశ్వత భూధార్ సంఖ్యను కేటాయిస్తామన్నారు. ప్రస్తుతానికి భూధార్ ద్వారా మ్యుటేషన్, సబ్ డివిజన్, జియో రిఫరెన్సింగ్ వంటి సేవలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో రైతులకు సంబంధించిన కార్యక్రమాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామన్నారు. 8 శాఖల సమన్వయంతో భూసేవను సమీకృతం చేశామని తెలిపారు. దేశంలోనే తొలిసారి సాంకేతిక విప్లవానికి తెర తీసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో అనేక రెవిన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టాపెట్టామన్నారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో భూసేవ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. ఇప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు.