గీతం విశ్వవిద్యాలయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన చైర్మన్ పదవిని నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, మూర్తి మనవడు ఎం శ్రీ భరత్ చేపట్టారు. ఈ మేరకు గీతం సొసైటీ పాలకవర్గం నిర్ణయం తీసుకోగా, శ్రీ భరత్ బాధ్యతలు స్వీకరించారు. ఇకపై ఆయన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని గీతం విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కాగా, భరత్ అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ డిగ్రీ విద్యతో పాటు స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ, ఎంఏ విద్యను పూర్తి చేశారు. ఆపై ఆయన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినిని వివాహమాడారు. అక్టోబర్ 1న అమెరికాలోని అలస్కా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. గీతం పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కుకు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మరణించారు.