ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన రెండో విడత పోలింగ్ మంగళవారం జరగనున్నది. రెండో దశలో 19 జిల్లాల పరిధిలో 72 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1,079 మంది అభ్యర్థులు తలపడనున్నారు. సెంట్రల్, ఉత్తర ఛత్తీస్గఢ్లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నది. 72 నియోజకవర్గాల్లో 46 జనరల్ కేటగిరి, తొమ్మిది ఎస్సీ, 17 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. రెండో విడత పోలింగ్లో 1,53,85,983 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 77,46,628 మంది పురుషులు కాగా, 76,38,415 మంది మహిళలు, 940 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. రెండో దశ పోలింగ్కు మొత్తం 19,296 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రారుపూర్ నగరం దక్షిణ నియోజక వర్గానికి అత్యధికంగా 46 మంది, బిడ్రానవిగఢ్ అసెంబ్లీ స్థానంలో అత్యల్ప సంఖ్యలో ఆరుగురు అభ్య ర్థులు పోటీ చేస్తున్నారు.
పోలింగ్ను శాంతియుతం గా నిర్వహించేందుకు లక్ష మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత గరియ బండ్, ధమ్తరి, మహాసముంద్, కబిర్ధమ్, జష్ పూర్, బలరామ్పూర్ జిల్లాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. తొమ్మిది మంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, బిజెపి, కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయించను న్నాయి. స్పీకర్ గౌరి శంకర్ అగర్వాల్ 2013లో గెలిచిన స్థానం కస్దోల్ నుంచే మళ్లీ పోటీ చేస్తు న్నారు. మంత్రులు బరిజ్మోహన్ అగర్వాల్ (రారు పూర్ నగరం దక్షిణ), రాజేష్ ముంట్(రాయపూర్ నగరం పశ్చిమ), అమర్ అగర్వాల్(బిలాస్పూర్), బాయియ్యాలాల్ రాజ్వాడే(బైకుంత్పూర్), రామ్ సేవక్ పైక్రా(ప్రతాపూర్), పున్లాల్ మోహిలే(మున్ ఘేలీ), ప్రేమ్ ప్రకాశ్ పాండ్య(బిలాయి నగర్), దయల్దాస్ బగ్హేల్(నవగఢ్), అజరు చంద్రకర్ (కురుడ్), బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ధర్మలాల్ కౌసిక్(బిల్హా) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భుపేష్ భగేలా(పటన్), ప్రతిపక్ష నేత టిఎస్ సింఘాదేవ్(అంబికా పూర్), దుర్గ్ లోక్సభ కాంగ్రెస్ ఎంపి తమరభవాజ్(దుర్గ్ గ్రామీణ), మాజీ కేంద్ర మంత్రి చరణ్దాస్ మహంతి(శక్తి) తదితరులు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
అజిత్ జోగి మర్వహి స్థానంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొత్త ముఖాలైన అర్చనా ప్రోటే, గులాబ్ సింగ్లను బిజెపి, కాంగ్రెస్ రంగంలోకి దింపాయి. జోగి మేనకోడలు రిచా జోగి(బిఎస్పీ) అక్లతారా నుంచి పోటీ చేయగా, బిజెపి నుంచి సౌరబ్ సింగ్, కాంగ్రెస్ నుంచి చున్నిలాల్ సాహు పోటీ చేస్తేన్నారు. చాలా స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మావోయిస్టు ప్రభావిత 18 స్థానాల్లో నవంబర్ 12న తొలిదశ పోలింగ్ జరి గింది. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టను న్నారు. 1079 మంది అభ్యర్ధుల్లో 1057 మంది గురించి సర్వే చేయగా వారిలో 239(23శాతం) అభ్యర్థులు కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమో క్రాటిక్ రిఫార్మ్స్(ఎడిఆర్) తెలిపింది. 130(12శాతం) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, 90(9శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 946 మంది పురుష అభ్యర్థులు, 111 మంది మహిళ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.