కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సామర్లకోట, పిఠాపురం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రత మండపాలు కిటకిటలాడాయి. ఒంగోలులో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు శివాలయాలన్నీ ముకంటి నామస్మరణతో మారుమోగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఎరగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లెలచెరువు, డోర్నాలలోని శివాలయాల్లో కార్తీక దీపారాధన చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు. ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.