సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలనే ఆకాంక్ష జననేత వైఎస్ జగన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం 300 రోజుల మైలు రాయిని అధిగమించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి తొలి అడుగుతో ప్రారంభమైన పాదయాత్ర.. అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. వెల్లువెత్తిన జన నీరాజనాలు, పోటెత్తిన మహిళల హారతులు, వృద్ధుల ఆశీర్వాదాలు, యువకుల కేరింతల నడుమ జిల్లాలు దాటే కొద్దీ మహోన్నత రూపం దాల్చింది.
ఒక జిల్లా సరిహద్దులు దాటి మరో జిల్లాలోకి ప్రవేశించేటప్పుడు జనం నుంచి లభిస్తున్న ఆదరణ రాష్ట్ర చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంత సుదీర్ఘమైన యాత్రలో లెక్కకు మిక్కిలి గ్రామాలను స్పృశిస్తూ విభిన్న వర్గాల ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ యాత్ర ఏ జిల్లాలో సాగుతుంటే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోతుండటం అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు, రాజకీయ వేత్తల నుంచే కాకుండా మేధావులు, విద్యావంతుల నుంచి సైతం యాత్రకు సంఘీభావం లభిస్తోంది. గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రకాశం బ్యారేజి మీదుగా యాత్ర చేరుకున్నపుడు, ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాజమండ్రి వద్ద ఉన్న రైల్ కం రోడ్డు బ్రిడ్జిని దాటుతున్నప్పుడు కనిపించిన జనసంద్రం నభూతో.. అంటున్నారు. ఈ రెండు చోట్లా జనం తాకిడికి వంతెనలు ప్రకంపించాయి.