మొరాదాబాద్: స్వదేశంలో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ట్రైన్ 18 ఆదివారం తన తొలి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఓ ప్రామాణిక రైల్వే ట్రాక్పై బరేలీ-మొరాదాబాద్ సెక్షన్ ఈ ట్రయల్ రన్ నిర్వహించింది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ టీమ్ పర్యవేక్షణలో ఈ రైలును నడిపి చూశారు. అక్టోబర్ 29న చెన్నైలో రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వని లోహానీ ఈ రైలును ప్రారంభించారు. నవంబర్ 11న ట్రయల్ రన్ కోసం ఈ రైలును ఢిల్లీకి పంపినట్లు ట్రైన్ 18ను తయారు చేసిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎస్ మణి తెలిపారు. నవంబర్ 13న ఢిల్లీ చేరుకున్న ఈ రైలును సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతానికి మాధ్యమిక స్థాయి వేగంతో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. కోటా, సవాయ్ మాధోపూర్ మధ్య హైస్పీడ్తో రైలును పరీక్షించనున్నారు. ఈ ట్రైన్ 18 గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వివిధ శతాబ్ది ఎక్స్ప్రెస్ల స్థానంలో ఈ ట్రైన్ 18లను ప్రవేశపెట్టనున్నారు.