ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రత పేరుతో భయభ్రాంతులు సృష్టిస్తున్నారు: కాంగ్రెస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 02:29 PM

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఆలయం వద్ద భద్రత పేరుతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యేలా ప్రభుత్వం వాతావరణం సృష్టిస్తోందని విమర్శించింది. శబరిమల ఆలయం వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు ముగ్గురు మాజీ మంత్రులతో కూడిన కమిటీని రాష్ట్ర కాంగ్రెస్‌ నియమించగా.. వారు ఈ మేరకు నివేదించారు. అయ్యప్ప గుడి ఓ కోటలా మారిపోయింది. అందులోకి భక్తులు వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. దేవస్థానం పరిసరాల్లో విపరీతంగా పోలీసులను మోహరించడం.. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. పటిష్టమైన భద్రత పేరుతో ఒకరకమైన భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించింది. విపరీతమైన భక్తుల తాకిడి నేపథ్యంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. అని కమిటీలో సభ్యులైన మాజీ మంత్రులు తిరువంచూర్‌ రాధాకృష్ణన్‌, అదూర్‌ ప్రకాశ్‌, వీఎస్‌ శివకుమార్‌ ఆరోపించారు. భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయాన్ని శుక్రవారం తెరిచిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని వర్గాల మహిళలూ ఆలయంలోకి ప్రవేశించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా నిరసనకారులు ఇందుకు అనుమతించడం లేదు. ఆలయంలోకి ప్రవేశించేందుకు శుక్రవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్‌ను నిరసనల మధ్య అక్కడి నుంచి పంపేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com