ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం పై చిదంబరం ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 02:46 PM

కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారనే విషయంపై ప్రధాని మోడీ అంత సమయం వెచ్చించి మాట్లాడం తమకు గొప్పగా ఉందని, అయితే అందులో సగం సమయం పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, రాఫెల్‌ కుంభకోణం, సిబిఐ, ఆర్‌బిఐల గురించి మాట్లాడడానికి కేటాయించగలరా అని మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత చిదంబరం ప్రశ్నించారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే నెహ్రూ- గాంధీ కుటుంబం నుండి కాక ఇతరులకు ఐదేళ్ల పాటు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టగలదా అని విమర్శించిన సంగతి తెలిసిందే. నెహ్రూ- గాంధీ కుటుంబం నుండి కాకుండా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఇతరవ్యక్తుల జాబితాను విడుదల చేస్తూ మోడీపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించారు. 1947 నుండి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా చాలా మంది బయటి వ్యక్తులు పనిచేశారని చిదంబరం పేర్కొన్నారు. ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్‌ టాండన్‌, యుఎన్‌ ధేబర్‌, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్‌, నిజలింగప్ప, జగజ్జీవన్‌ రామ్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ, దేవకాంత బరూవా, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరిల పేర్లను ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా స్వాతంత్య్రానికి ముందు నుండి ఎంతో మంది గొప్ప నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారని, అందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కె. కామరాజ్‌, మన్మోహన్‌ సింగ్‌ ఇలా ఎంతో మంది నేతలు దేశం కోసం కృషి చేశారని అన్నారు. అయితే ఇక మోడీ ఆయన హయాంలోని రాఫెల్‌ ఒప్పందం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలపై మాట్లాడాలని కోరారు. మూకదాడులు, మహిళలపై అత్యాచారాలు, ఉగ్రదాడులు తదితర అంశాలపై మాట్లాడతారా అని చిదంబరం సవాలు చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com