తెల్ల రేషన్ కార్డు దారులకు చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు అందజేయనున్నట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో చంద్రన్న కానుకల సరుకులను మంత్రి పరిశీలించారు. పేదల కోసం అందజేస్తున్న చంద్రన్న కానుకల నాణ్యతను మంత్రి పరిశీలించారు. పేదలందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రన్న కానుకలు అందజేస్తుందని, సరకుల నాణ్యతలో రాజీ పడకుండా నాణ్యమైన సరకులు ప్రజలకు అందజేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు మంత్రి సూచించారు. రేషన్ దుకాణాలకు సరకులు సరఫరా చేసేపుడే అధికారులు నాణ్యతను పరిశీలించి పంపాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫాను అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిఎం చిదంబరం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.