బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎన్ని మార్గాలు కనిపెడుతున్నా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా, తిరుచ్చి విమానాశ్రయంలో పట్టుబడిన స్మగ్లర్లను చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. మలద్వారం వద్ద, అరికాలికి బంగారం కడ్డీలను అంటించి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి వచ్చిన ముగ్గురు ఎయిరిండియా ప్రయాణికుల నడకతీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి ఆశ్చర్యపోయారు. ప్రత్యేకమైన జిగురుతో వారి మలద్వారం, అరికాలికి అంటించుకున్న బంగారు కడ్డీలను గుర్తించారు. మొత్తం 1.25 కిలోల బరువున్న బంగారు కడ్డీలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రియాజ్ అహ్మద్, తమీమ్ అన్సారీ, జకీర్ హుస్సేన్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.