వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో మళ్లీ సమావేశం అయ్యేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ వెల్లడించారు. గత జూన్లో జరిగిన సింగపూర్ సదస్సుకు ఇది కొనసాగింపువంటిదని గురువారం తెలిపారు. ఉత్తరకొరియా అణ్వాయుధ తయారీ కార్యక్రమానికి చరమగీతం పాడడం సహా ఇతర అంశాల్లో పురోభివృద్ధి కోసం ఈ సమావేశం తోడ్పడుతుందని అన్నారు. అమెరికా గత పాలకులు ఉత్తర కొరియా విషయంలో చేసిన తప్పులను తాము చేయబోమని స్పష్టం ఆయన చేశారు. ఆ దేశానికి దశాబ్దాలుగా ఎన్నో హామీలిచ్చి, వాటిని తుంగలో తొక్కి ఆంక్షలు విధించారని విమర్శించారు. అయితే ఈ సమావేశం ఎప్పుడు.. ఎక్కడ అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.