కాంగ్రెస్ పాలనలో అవినీతి, నక్సలిజం, టెర్రరిజం ప్రబలాయని.. వాటిని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విప్లవకారులుగా చెప్పుకునే మావోయిస్టుల దాడుల్లో చనిపోయిన ‘అమరవీరుల బలిదానాల’ను కాంగ్రెస్ అవమాన పరుస్తోందని అన్నారు.
‘‘సమాజాన్ని కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా విభజించడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. గడిచిన 55 ఏళ్ల తన పాలనలో కాంగ్రెస్.. పేదరకం, టెర్రరిజం, నక్సలిజం, అవినీతి, తప్పుడు పాలనలను ప్రోత్సహించింది’’ అని యోగి అన్నారు. అంతే కాకుండా పేరు చెప్పకుండానే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్పై విమర్శలు గుప్పించారు. ఎంతో మంది సైనికులను పొట్టన పెట్టుకున్న మావోయిస్టును ఆయన విప్లవకారులను యూపీకి చెందిన కాంగ్రెస్ నే సంబోధించారంటూ మండిపడ్డారు.
అయితే నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అనే నినాదంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు ‘బీమారీ’ (సుస్తీ) చేసిందని బీజేపీ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని యోగి అన్నారు.