కాకినాడ : అంగన్వాడీ వర్కర్ల విషయంలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం మండల కేంద్రమైన అడ్డతీగలలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. నిత్యం అప్పులు చేసి నిత్యావసర వస్తువుల కొని పిల్లలకు వండి పెడుతున్నామని పేర్కొన్నారు. కానీ వాటి బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని వాపోయారు. అందువల్ల తాము పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లకు ఏకరూప దుస్తులు ఇవ్వడంలేదని తెలిపారు. అంతేకాకుండా అదనపు పనులను పురమాయిస్తూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. 10 సంవత్సరములు దాటిన అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచి ప్రసూతి సెలవులు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అడ్డతీగల ఐ సి డి ఎస్ సి డి పి వో దుర్గా వాణి కి వినతి పత్రం అందజేశారు.