ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ,,,లోకేష్‌ను 50 ప్రశ్నలు అడిగిన సీఐడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:01 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ సుమారు ఆరున్నర గంటల పాటు విచారించింది. మంగళవారం (అక్టోబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ను అధికారులు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన లోకేష్.. మీడియాతో మాట్లాడారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధంలేని ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరవ్వాలని కోరారని తెలిపారు. ‘సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరయ్యా. అయితే, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధంలేని అనేక ప్రశ్నలు అడిగారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు. నన్ను మొత్తం 50 ప్రశ్నలు అడిగారు. అయితే, అందులో 49 ప్రశ్నలు.. గూగుల్‌లో కొడితే సమాధానాలు వచ్చేవే. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు విషయంలో నేను, నా కుటుంబసభ్యులు ఎలా లాభపడ్డామో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నేను ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఇది కక్షసాధింపు తప్ప, ఎలాంటి ఆధారాలు లేని కేసు. వైసీపీ ప్రభుత్వం లేని కేసులు పెట్టి, దొంగ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోంది’ అని నారా లోకేష్ ఆరోపించారు.


‘మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇలాంటి గూగుల్‌లో సమాధానాలు దొరికే ప్రశ్నలన్నీ విచార‌ణాధికారులు నన్ను అడిగారు’ అని లోకేష్ అన్నారు. ‘బుధవారం కొన్ని పనులతో బిజీగా ఉంటాను.. ఇంకా ఏవైనా ప్రశ్నలుంటే ఎంత సమయమైనా సరే ఇవాళే అడగండి, వాటన్నింటికీ సమాధానం చెబుతాను అని విచారణాధికారిని కోరాను. అయినప్పటికీ బుధవారం మరోసారి విచారణకు రావాలని చెబుతూ నాకు అక్కడే 41ఏ నోటీసులు ఇచ్చారు’ అని లోకేష్ చెప్పారు. నేడు హాజరైన విధంగానే ఎల్లుండి (బుధవారం) కూడా విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. మరోవైపు.. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌ కలిశారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి పయ్యావుల కేశవ్‌ మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం జైలు వద్ద పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని తమ అధినేత చెప్పారని తెలిపారు. ‘ప్రజలు, పార్టీ నేతలు ఏవిధంగా ఉన్నారనే ఆవేదన చంద్రబాబులో ఉంది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మాలో ధైర్యం వచ్చింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు’ అని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు పోరాటంతో ప్రజల్లో స్పందన చూసి ప్రభుత్వం భయపడి ఆయణ్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com