ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌కు టీడీపీ నేత కౌంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 02:38 PM

తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పర్యటించిన పవన్ కల్యాణ్.. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్దరించలేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. తుఫాను ముగిసి ఆరు రోజులైనా ఇంకా సగం గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి.. గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారూ ఆ గ్రామాల్లో వెలుగులు నింపండంటూ ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని ఫేస్‌బుక్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకూ విద్యుత్ సరఫరా ఎందుకు పునరుద్దరించలేకపోయారనే విషయాన్ని ఆధారాలతో సహా తాను సమాధానం ఇస్తున్నానంటూ గురువారం అర్థరాత్రి ఎఫ్‌బీలో ఓ పోస్టును పెట్టారు. 


ఇప్పటివరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ దిగజారుడు ట్వీట్‌కు, ఆధారాలతో సహా తన సమాధానం ఇదేనంటూ ఆమె తన పోస్టులో విమర్శలు గుప్పించారు. ‘శ్రీకాకుళం తుఫానుపై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను వచ్చిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తాన్ని పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికి ఏడు రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం గురించి అంచనా వేస్తూ, అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ, ఆ రాత్రి నిద్ర కూడా పోకుండా అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు’. 


‘సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చేయాలి.. లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు, పేపర్‌లో ఏదో రాసుకుని, ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని ట్వీట్ మొదలు పెట్టి, మీ అంతు చూస్తానని అన్నాడు. తరువాత కరెంటు విషయంలో... ఇప్పటికి ఆరు రోజులు అయ్యింది, ఇంకా ఎందుకు రాలేదంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు పవన్. నిజానికి, పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే వేల మంది ఉద్యోగులను.. పవన్ చౌకబారు ఆరోపణకు, ఆధారాలతో సహా నా సమాధానం ఇది’. 


‘ఇరవై-ముప్పై ఏళ్ల నుంచి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలమైంది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరోచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఏడువేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా, దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాం బిడ్డలను వదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33 కేవీ లైన్లు, తరువాత 11 కేవీ లైన్లు సరిచేయాలి. ట్రాన్స్ ఫార్మర్స్, పోల్స్ కూడా పడిపోయాయి. వాటిని నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్‌లా అయిపోదు. ఇప్పటికి దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం, కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి’ అని యామినీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com