చాట్ బండిని నడుపుతూ బతుకు సాగిస్తున్న ఓ చాట్వాలా వద్ద రూ.1.2 కోట్ల నగదు లభ్యమైంది. పంజాబ్లోని లుధియానా నగరానికి చెందిన ఓ వ్యక్తి పటియాలా ప్రాంతంలో చాట్ బండిని నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చాట్వాలా వద్ద లెక్కలోకి రాని రూ.1.2 కోట్ల నగదు లభ్యమైంది.
గత రెండేళ్లుగా ఆ వ్యక్తి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో అతని వద్ద ఇంత సొమ్ము ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొంతకాలంగా ఐటీ అధికారులు పటియాలా ప్రాంతంలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చాట్ బండిని నడుపుతున్న వ్యక్తికి అదే ప్రాంతంలో మరికొన్ని దుకాణాలు ఉన్నాయని, వాటిని కూడా అతనే చూసుకుంటున్నాడని తెలిసి అధికారులు అతనిపై ఓ కన్నేసి ఉంచారు. అతనికి సంబంధించిన దుకాణాల వివరాలను ఆరాతీయగా రియల్ ఎస్టేట్లోనూ లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.
అదే సమయంలో చాట్వాలా నివాసంలో దాడులు నిర్వహించగా రూ.1.2 కోట్లు బయటపడ్డాయి. ‘మేం ఇప్పటివరకు చేసిన దాడుల్లో చిరు వ్యాపారులే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది. అందుకే పన్ను ఎగవేతదారులపై దృష్టిపెట్టి ఒక్కొక్కరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నాం’ అని ఓ ఐటీ అధికారి వెల్లడించారు.