దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణం కోసం గురువారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన.. అనంతరం తిరుమల చేరుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయం ముందర మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంలో భాగంగా తిరుమలకు వచ్చానని చెప్పారు. 1993 'గోవిందా గోవిందా' అనే సినిమా సమయంలో తిరుమలకు వచ్చానని, ఆ తర్వాత తిరుమలకు రావడం ఇదేనని తెలిపారు.తనకు దేవుడంటే నమ్మకమని, నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తానని వర్మ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే భక్తుడు అంటే తనకు నమ్మకం లేదని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి స్వామివారి అనుగ్రహం ఉండేవిధంగా కోరుకున్నానని, సినిమాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.